Pages

(c) WRITER

బేతాళ కథలు మొదటినుంచి చదవాలనుకుంటే ఇక్కడ నొక్కండి - రూపాయి చెప్పిన మొదటి బేతాళ కథ

Sunday, July 26, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 5

మా ఆయనకు ఒకటే డబ్బు పిచ్చి. మీరు రాసిన కథలు చదివాక ఆ పిచ్చి ఇంకా ముదిరింది. ఒక సరదా లేదు, ఒక సంతోషం లేదు...


అమ్మో!! అంటే తప్పంతా నా మీదకు నెట్టేస్తున్నారా? డబ్బు ఖర్చు పెట్టకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదండీ! సరదా, సుఖం, సంతోషం సాధించలేని డబ్బు వున్నా వృధాయే. ఈ రోజు కడుపు మాడ్చుకోని రేపటికి దాచుకోవడం అవివేకం. ప్రముఖ హాస్య నటుడు రేలంగిగారు అనేవారట – “రాళ్ళని కూడా అరాయించుకునే రోజుల్లో డబ్బులు వుండేవి కావు, ఇప్పుడు డబ్బులున్నాయి కానీ మరమరాలు కూడా అరగట్లేదు” అని. రేపటి సుఖం కోసం డబ్బు దాచుకోమని సలహా ఇస్తున్నానే తప్ప ఈ రోజు సుఖాన్ని వదులుకోమని చెప్పటం లేదు. సరే, అదలా వుంచి మీ సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం. కుటుంబం అంతా కలిసి చేస్తేనే సంపద సాధ్యమౌతుంది. ఆ విషయం మీ వారికి చెప్పండి. ఏ ఆర్థిక ప్రణాలిక అయినా, ఖర్చు అయినా ఇద్దరూ కలిసి చర్చించుకున్న తరువాతే జరగాలని నియమం పెట్టండి. వృధా ఖర్చులను ఆపడంలో మీరు సహాయం చేయండి. కుటుంబం ఆనందం కోసం పెట్టాల్సిన ఖర్చులను మీ చేతిలోకి తీసుకోని, ఖర్చుపెట్టండి. అలాగే ఆయన ఆదా చేసే పథకాల గురించి కూడా తెలుసుకోని వాటి అవసరాన్ని గుర్తించండి. సంసారమైన, సంపద సాధన అయినా భార్యాభర్తల అన్యోన్యతతోనే సాధ్యమౌతుంది.

రూపీబేతాళా, నేను గత రెండు సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. నేను కొన్న షేర్లు అన్నీ బాగా పెరిగి నాకు లాభాలనే ఇచ్చాయి. దాదాపు ఎప్పుడూ నా అంచనాలు తప్పలేదు. ఇప్పుడు బ్యాంక్ నుంచి కొంత డబ్బు లోన్ తీసుకోని మరీ మార్కెట్ లో పెట్టాలని అనుకుంటున్నాను. మీలాగే నేను కూడా స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఎలా సంపాదించవచ్చో నేను కూడా సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను.

మీరు చెప్పినదాని ప్రకారం స్టాక్ మార్కెట్ వల్ల డబ్బులు ఎలా నష్టపోవచ్చో చెప్పగలరు అనిపిస్తోంది. గత కొంతకాలంగా సెన్సెక్స్ పెరుగుతూ వస్తోంది. అందువల్ల లాభాలు రావటం సహజం. దాన్ని చూసుకోని స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలిసిపోయింది అనుకోవడం భ్రమ. ఇప్పుడు మీరు బ్యాంక్ వడ్డీకి డబ్బులు తెచ్చి పెడతానంటున్నారు. పర్సనల్ లోన్ పైన ప్రస్తుతం బ్యాంకులు పధ్నాలుగు నుంచి పద్దెనిమిది శాతం వడ్డీ వేస్తున్నాయి. అంటే స్టాక్ మార్కెట్ లో మీరు అంతకన్నా ఎక్కువ లాభాలు సంపాదించాలి. అది నిజంగా సాధ్యమయ్యే పనేనా? అందులోనూ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. ఒక్క పొరపాటు చేసినా మొత్తం డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ తరువాత తెచ్చిన అప్పుకు ఈ.ఎమ్.ఐ లు కట్టాలని మర్చిపోకండి. పూర్తి అవగాహన లేకుండా నేరుగా స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టడం ఒక తప్పు. అప్పు తెచ్చిన డబ్బు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికి సంపాదించిన డబ్బును (కనీసం లాభాన్నైనా) తీసి మ్యూచువల్ ఫండ్ మార్గంలో వెళ్ళండి. దీర్ఘకాల ముదుపు మాత్రమే లాభాలను ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. రోజూ స్టాక్ మార్కెట్ లో మీరు చేస్తున్నది ముదుపు కాదు, కాస్త కాలిక్యులేటెడ్ జూదం మాత్రమే.

మొన్ననే కొడుకు పుట్టాడు. వాడు పెద్దయ్యేసరికి వాడికంటూ ఒక ఇల్లు వుండాలి. అందుకే హోమ్ లోన్ పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నాను.

పిల్లల కోసం ఆస్థి సంపాదించడం అంత మంచి ఆలోచన కాదు. మీ కోసం కావాలంటే కొనుక్కోండి. మీరు కొన్న ఇంట్లో మీ అబ్బాయి వుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు. మీ నాన్నగారు వున్న ఇంట్లో మీరు వుంటున్నారా? ఇంతకు ముందు తరం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చారు, తరంలో అంతా రాజధానుల వైపే వెళ్తున్నారు. రాబోయే తరం దేశంలో వుంటుందో లేదో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు వాళ్ళు అనుభవించాలని ఇళ్ళు, స్థలాలు కొనడం సమంజసం కాదేమో ఆలోచించండి. అప్పుడు అవసరం అయితే ఇంటిని అమ్ముకోని డబ్బుతో వాళ్ళకు నచ్చిన చోట కొనుక్కుంటారు అని మీరు అనచ్చు. ఇళ్ళు అమ్ముకోవడం అంత సులభం కాదు. అందుకు సెంటుమెంటు నుంచి రియల్ ఎస్టేట్ ఒడిదుడుకుల దాకా ఎన్నో అవాంతరాలు వుంటాయి. అలాంటి పెట్టుబడి కోసం హోమ్ లోన్ కూడా చేయల్సి వస్తే అది ఇంకా ఇబ్బందికరం. దాని కన్నా మీరు తీసుకోవాలనుకుంటున్న లోన్ ఈ.ఎమ్.ఐ ఎంతౌతుందో అంత వేరే చోట ఇన్వెస్ట్ చేయండి. మీ అబ్బాయి ఇల్లు కొనాలనుకునే నాటికి కొన్ని కోట్లు సేకరించి ఇవ్వచ్చు. ముందే ఇల్లు కొంటే దాని విలువ ఇంత పెరుగకపోవచ్చు.

మార్కెట్ పడిపోతుందని, ఇప్పట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వస్తాయని, కనీసం ఇంకో ఆరు నెలలు ఆగితే మంచిదని నా స్నేహితుడు అంటున్నాడు. మీరేమంటారు?

మీరు ఆరు నెలల తరువాత డబ్బులు పెడితే మార్కెట్ పడిపోదని ఆయన గ్యారంటీ ఇస్తారేమో కనుక్కోండి. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ అలా తెలుసుకోగలిగిన వ్యక్తి వుంటే అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారిపోయేవాడు. మార్కెట్లో రేటు తక్కువలో వున్న సమయం కనిపెట్టి పెట్టుబడి సరిగ్గా అదే సమయానికి పెట్టి, మళ్ళీ మార్కెట్ పూర్తిగా పెరిగిన సందర్భాన్ని గుర్తుపట్టి అమ్మేసుకోవడం దాదాపు అసాధ్యమైన పని. అసలు విషయం వినండి - మార్కెట్ లో నేరుగా షేర్లు కొని, డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్కెట్ పడిపోతే నష్టం వస్తుంది కానీ దీర్ఘకాలిక పెట్టుబడి, (ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా) పెట్టినవాళ్ళని మార్కెట్ ఒడిదుడుకులు దాదాపుగా ఏమీ చెయ్యలేవు. కనీసం పది సంవత్సరాలపాటు పెట్టుబడి పెట్టేట్లైతే మార్కెట్ పడుతుందా లేస్తుందా అని ఆలోచించకండి. అనవసరం. ట్రేడింగ్ కోసం మార్కెట్ లో డబ్బు పెట్టి మార్కెట్ పడుతుందా లేస్తుందా తెలుసుకోవాలని అనుకోకండి. అది అసాధ్యం. 

Sunday, July 19, 2015

ఓకే బంగారం (Gold Monetisation Scheme)


అంతా పసిడిమయం
మన దేశంలో ముఖ్యంగా దక్షిణభారతంలో బంగారం లేని ఇల్లు అంటూ వుండదు. పండగలప్పుడు, వేడుకలలో బంగారం తళుక్కుమనకపోతే ఆ పండగ పండగేకాదు, ఆ వేడుక వేడుకే కాదు. బంగారు నగల పైన మనకున్న మోజును పక్కనపెడితే, చాలామంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా కూడా కొంటుంటారు. అయితే ఇందులో ఒక తిరకాసు వుంది. బంగారాన్ని ఆభరణంగా కొన్నప్పుడు దాని మీద మనం పెట్టే ఖర్చులో బంగారం విలువతో పాటు మజూరీ, వేస్టేజ్ రూపంలో మరికొంత అదనంగా చెల్లిస్తాం. అదే ఆభరణాన్ని తిరిగి అమ్మాలని వెళ్ళినప్పుడు తరుగు వగైరా మినహాయించుకోని మిగిలిన విలువనే తిరిగి పొందుతాం. అంటే ఒక బంగారు నగను కొన్న మరుక్షణం దాని విలువ పదిపోతుంది. అందుకే ఆభరణంగా కొన్న బంగారం, ఖర్చే తప్ప పెట్టుబడి కాదు అని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. (బిస్కెట్ల రూపంలోనో, నాణాల రూపంలోనో కొన్న బంగారానికి కొంతవరకు పెట్టుబడి లక్షణం వుంటుంది.) అదీకాక ఒకసారి నగలు కొన్న తరువాత మరీ అవసరమైతే తాకట్టు పెడతాం తప్ప దానిని అమ్ముకోడానికి సిద్ధపడము. అందువల్ల మన ఇళ్ళలో వుండే టీవీలాగానో, ఫ్రిజ్ లాగానో బంగారం ఆభరణం కూడా ఒక వస్తువులా మిగిలిపోతుంది. అందుకే నగలరూపంలో కొన్న బంగారం పెట్టుబడి కాదని (Dead investment) చెప్తారు.

ఈ పరిస్థితిలో కొంత మార్పు తీసుకొచ్చే ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. “గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్” (బంగారం నగదీకరణ పథకం / బంగారాన్ని నగదుగా మార్చే పథకం) పేరుతో ఈ పథకం త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ పథకం విధి విధానాలను వివరించే పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నిజానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇలాంటి పథకం ఒకటి రాబోతోందని ఈ సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలోనే ప్రకటించారు. “ఈ కొత్త పథకం ద్వారా ఖాతాదారులు బంగారు ఖాతా ద్వారా వడ్డీ పొందవచ్చు, నగల వ్యాపారులు బాంకు నుంచి అప్పుగా బంగారాన్ని తీసుకోవచ్చు” అని స్థూలంగా అప్పుడే వెల్లడించారు. ఇప్పుడు మరికొంత వివరంగా ఆ పథకం గురించిన ప్రకటన వెలువడింది.

అసలు ఎందుకిదంతా?
సుమారు ఇరవై వేల టన్నుల బంగారం మన దేశంలోనే వుంది (అంటే ప్రస్తుత విలువ ప్రకారం అరవై లక్షల కోట్లు). ప్రతి సంవత్సరం దేశంలో బంగారం వినియోగం పెరుగుతూనే వుంది. కేవలం నగలకోసంమే కాక కొన్ని కర్మాగారాలలో ముడిసరుకుగా, మందుల తయారిలో ఇంకా అనేక పరిశోధనల్లో బంగారాన్ని వాడాల్సి వుంటుంది. ఇంత బంగారం మన దేశ గనుల్లో ఉత్పత్తి కాదు కాబట్టి సంవత్సరానికి సుమారు వెయ్యి టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఒక వైపు ఎంతో బంగారం నగల రూపంలో, బిస్కెట్ల రూపంలో మన ఇంట్లో, బాంకు లాకర్లలో పడి మూలుగుతుంటే, మరో వైపు టన్నుల కొద్దీ బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. దీనిని సరిదిద్దే ఆలోచనే ఈ పథకం. ఒకసారి ఈ పథకం అమలులోకి వస్తే ప్రపంచంలోనే ఇలాంటి ఆలోచన చేసిన మొదటి దేశం మనదేశమే అవుతుంది.

ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన విధానాలలో ఈ పథకం ఎలా పనిచేస్తుందో వివరంగా వుంది. ఈ పథకాన్ని వాడాలనుకున్న వ్యక్తి లేదా సంస్థ  తమ దగ్గర వున్న బంగారాన్ని (కనీసం 30 గ్రా అంటే సుమారు మూడున్నర సవర్లు) ప్రభుత్వం నిర్థారించిన వెరిఫికేషన్ సెంటర్ లో ఇవ్వాలి. వాళ్ళు ఆ బంగారం విలువని పరీక్షించి ఆ వివరాలతో ఒక సర్టిఫికేట్ ఇస్తారు.

వెరిఫికేషన్ సెంటర్ ఇచ్చిన సర్టిఫికేట్ ని బ్యాంకులో ఇచ్చి ఎకౌంట్ ప్రారభించవచ్చు. సర్టిఫికేట్ లో వున్న బంగారం విలువ ఈ ఎకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. వడ్డీ డబ్బు రూపంలో కాకుండా బంగారం రూపంలో లభిస్తుంది. ఉదాహరణకు వంద గ్రాముల బంగారం డిపాజిట్ చేస్తే, వడ్డీ ఒక శాతం అయితే బంగారం విలువ నూటొక్క గ్రాము అవుతుంది.

ఇలా బంగారం విలువకు వడ్డీని జోడిస్తూ వెళ్తారు. డిపాజిట్ చేసిన 30 రోజుల తరువాత నుంచి ఎప్పుడైనా ఈ డిపాజిట్ వెనక్కి తీసుకోవచ్చు. బంగారంగా కావాలంటే బంగారం రూపంలో, డబ్బుగా కావాలంటే డబ్బు రూపంలో వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో డిపాజిట్ చేసినప్పుడే చెప్పాల్సివుంటుంది.

మరోవైపు వెరిఫికేషన్ సెంటర్లో సేకరించిన బంగారాన్ని రిఫైనరీలో కరిగించి బంగారం బార్లగా తయారు చేస్తారు. వీటిని ప్రభుత్వ అధీనంలో వున్న లాకర్లలో వుంచుతారు. వీటిపైన అధికారం బ్యాంకుకే వుంటుంది. ఈ బంగారాన్ని నగల వ్యాపారులకు అప్పుగా ఇవ్వచ్చు. వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోని బంగారం కొనుక్కునే బదులు నేరుగా బంగారాన్నే తీసుకోని ఆ విలువ ప్రకారం వడ్డీ కట్టుకోవచ్చు.

డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీ ఎంత ఇవ్వాలో, అప్పుగా ఇచ్చిన బంగారంపైన ఎంత వడ్డీ తీసుకోవాలో బ్యాంక్ నిర్ణయించుకుంటుంది. ఒకవేళ ఆ బంగారాన్ని నగల వ్యాపారులకు ఇవ్వనట్లైతే దాన్ని CRR, SLR గా చూపించుకునే అవకాశం వుంటుంది. (మన దగ్గర తీసుకున్న డిపాజిట్ డబ్బులో కొంత శాతాన్ని బ్యాంక్ తమ దగ్గరే వుంచుకోవాలి. కొంత డబ్బుని ప్రభుత్వ బాండ్లలో పెట్టాలి. వీటినే CRR, SLR అంటారు)

ఎవరెవరికి ఉపయోగం?
ముందు వినియోగదారులుగా మనకి వచ్చే ప్రయోజనం గమనిద్దాం. – మన దగ్గర కొంత బంగారం వుంది. ఇది ముందే చెప్పినట్లు ఇంట్లో ఒక టీవీలాగ, ఫ్రిజ్ లాగా ఒక వస్తువుగా వుండిపోయిందే తప్ప దాని వల్ల మనకి వస్తున్న లాభమంటూ ఏమీ లేదు. బంగారం ధర పెరుగుతుందని అనుకున్నా, అది మొదట మనం కట్టిన ఎక్కువ డబ్బు (మజూరి, వేస్టేజ్ వగైరా), అమ్మేటప్పుడు నష్టపోయే డబ్బుతో కలిపి చూసుకుంటే పెద్ద లాభం కనిపించదు. మరీ విచిత్రమేమిటంటే అదే బంగారాన్ని మనం బాంక్ లాకర్లో పెట్టి, అదనంగా లాకర్ చార్జీలు కడుతుంటాము. మనం పెట్టిన డబ్బుమీద కొంతైనా లాభం తెచ్చిపెడితేనే దాన్ని మనం పెట్టుబడి అనాలి. అలా చూస్తే బంగారం మనకి లాభాన్ని తెచ్చిపెట్టకపోగా, మన చేత ఇంకా ఖర్చు పెట్టిస్తోంది. ఇప్పుడు ఈ విధానం వల్ల మన దగ్గర వున్న బంగారానికి వడ్డీ కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఈ వడ్డీ మీద పన్ను రాయితీ కూడా ఇచ్చే అవకాశం కూడా వుంది.

రెండో వైపు వున్నది నగల వ్యాపారులు. వీరు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న బంగారాన్ని కొనుక్కుంటున్నారు. ఈ బంగారాన్ని నగల రూపంలోకో, నాణాల రూపంలోకో మార్చడానికి అదనంగా కొంత ఖర్చు అవుతుంది. ఆ తరువాత ఆ ఆభరణం అమ్ముడయ్యేదాకా అది వారి షోరూమ్ లోనే వుంటుంది. అంటే అప్పటిదాకా ఆ నగ తయారికి పెట్టిన ఖర్చంతా వెనక్కి రాని పెట్టుబడిలా వుండిపోతుంది. ఆదాయం లేకపోగా, ఆలస్యమైతే నష్టం వచ్చే పరిస్థితులు ఇప్పటిదాకా వున్నాయి. ఈ పథకం ప్రకారం బాంకు నుంచి నేరుగా బంగారాన్నే అప్పుగా తీసుకోవటం వల్ల వాళ్ళకు కొంత కలిసొస్తుంది. ఈ పథకం విజయవంతం అయితే బంగారం దిగుమతి కూడా తగ్గిపోతుంది. అంటే మరి కాస్త ఖర్చు తగ్గినట్లే కదా? ఫలితంగా బంగారం ధర కిందకు దిగే అవకాశం వుంది. బ్యాంక్ వేసే వడ్డీ మరీ ఎక్కువగా లేకపోతే ఖచ్చితంగా బంగారం ధర తగ్గే అవకాశం వుంది.

మూడొవది బ్యాంకులు. వీళ్ళు సామాన్యంగా డిపాజిట్ల పైన తక్కువ వడ్డీ ఇస్తూ, ఇచ్చిన అప్పుల మీద ఎక్కువ వడ్డీ తీసుకుంటూ వుంటారు. ఈ రెండు వడ్డీలలో వ్యత్యాసమే బ్యాంక్ కి మిగిలే లాభం. ఇప్పుడు డబ్బు బదులు బంగారాన్ని వాడి కూడా ఇదే విధంగా లాభాలు సంపాదించవచ్చు. మనం పెట్టిన బంగారం పైన తక్కువ వడ్డీ ఇస్తూ, నగల వ్యాపారికి ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వడం ద్వారా లాభాలు సంపాదించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటిదాకా డబ్బుల రూపంలో జరుగుతున్న లావాదేవీలకు ఇవి అదనంగా జరుగుతాయి. మరోలా చెప్పాలంటే బంగారం రూపంలో కొత్తరకం డబ్బు వచ్చినట్లే. అందువల్ల బ్యాంక్ మాత్రమే కాకుండా మొత్తం ఎకానమీ మొత్తం లాభపడే అవకాశం వుంది.

అంతా మంచికేనా?
అంతా మంచికే అని చెప్పలేము. ఇలాంటి పథకం మనకి కొత్తేమీ కాదు. 1999 గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటిదే ఇది కూడా. అది అంతగా విజయవంతం కాలేదు. అందుకు ప్రధానకారణం బంగారం అంటే ప్రజలలో వుండే సెంటిమెంట్, వ్యామోహం. నగలు అవసరానికి తాకట్టి పెట్టడం వేరు, డిపాజిట్ గా ఇవ్వటం వేరు. తాకట్టు పెట్టినప్పుడు నగ రూపం మారదు. కానీ, ఇప్పుడు ప్రతిపాదించిన పథకం ప్రకారం నగను తీసుకోగానే కరిగించేస్తారు. ఇది సామాన్య ప్రజలు ఎట్టిపరిస్థితిలోనూ జీర్ణించుకోలేని విషయం. మన బంగారం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి అందుతూ వచ్చే ఆస్థి. మనకి బంగారం అంటే స్టేటస్ సింబల్. అలాంటి బంగారాన్ని కరగించి డిపాజిట్ గా మార్చుకోడానికి ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి.

బంగారం నగల రూపంలో కన్నా బిస్కెట్ రూపంలోనో, నాణాల రూపంలో వుంచుకున్న వాళ్ళకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.  అదే నిజమైతే చాలామంది బంగారం రూపంలో దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీయవచ్చు. ఎంత వరకు బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు? వాటి విలువ మరీ ఎక్కువగా వుంటే ఆదాయపన్ను శాఖ ఎలా వ్యవహరిస్తుంది? అన్న వివరాలు ప్రస్తుతానికి లేవు.

ఓకే బంగారం
ఇది ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన మాత్రమే. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్లలో ప్రకటించారు. జూన్ 2 లోగా ఈ పథకం గురించి ప్రజలు/సంస్థలు తమ తమ అభిప్రాయాలు చెప్పే వీలుంది. అవన్నీ పరిగణించి, మార్పులేమైనా వుంటే వాటిని చేసిన తరువాతే ఈ పథకం అమలులోకి వస్తుంది.


ఏది ఏమైనా ఈ పథకం వల్ల సామాన్య ప్రజలకు బంగారం మీద వ్యామోహం తగ్గే అవకాశం వుంది. నగల రూపంలో బంగారం dead investment అనుకునేవాళ్ళకి అది లాభాలను ఇచ్చే పెట్టుబడిగా మారబోతోంది. బంగారంతో ఒక కరెన్సీలా పరిమితమైన లావాదేవీలు జరగబోతున్నాయి. దీని ఫలితాలు ఎలా వున్నా బంగారం కొత్త రూపాన్ని చూడబోతున్నాం. ఈ కొత్త రూపం మనకి ఆనందాన్ని ఇస్తుందా? లేక బంగారం మనిషి వ్యామోహం మీద తన ఆధిపత్యాన్ని సాధిస్తుందా? వేచి చూద్దాం… ఓకేనా బంగారం?

(ఆంధ్రభూమి వారపత్రిక ప్రత్యేక వ్యాసం)

Sunday, July 12, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 4

మా అబ్బాయి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుండేవాడు. లక్షల్లో జీతం వచ్చేది. అక్కడ ఏదో పొరపాటు వల్ల అతని ఉద్యోగం పోయింది. మూడు నెలలుగా వేరే ఉద్యోగం దొరకలేదు. ఇంటిల్లిపాదీ దిగులుపడుతున్నాము.

మీ అబ్బాయి చేసిన పొరపాటు ఒకటి కాదు. రెండు. ఇప్పటి కార్పొరేట్ ఉద్యోగాలలో చిన్న తప్పు కూడా పెద్ద శిక్షేపడుతుంది. ఇక పెద్ద తప్పులు – అంటే కంపెనీ డబ్బు స్వంతానికి వాడుకోవడం, పైరవీలు చెయ్యడం, యాజమాన్యానికి వ్యతిరేకంగా పని చెయ్యడం, సహౌద్యోగులతో ముఖ్యంగా స్త్రీలతో అభ్యంతరకరంగా ప్రవర్తించడం  - ఇలాంటివి మొత్తం కెరీర్ నే నాశనం చేస్తాయి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఇక నేను చెప్పిన రెండో తప్పు – ఉద్యోగంలో ఇలాంటి రిస్క్ వుందని తెలిసి కూడా ముందుజాగ్రత్త లేకపోవటం. ఎలాంటి ఉద్యోగమైనా కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు అందుబాటులో ఉంచుకోవాలి. దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవడమే ఇది. నెల ఖర్చులలో కనీసం కొంత భాగానికైనా సరిపోయేలా మరో ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోని వుండాలి. మీ అబ్బాయి టెక్ ఉద్యోగి కాబట్టి ఆయనకు వచ్చిన సాఫ్ట్ వేర్ నేర్పించే ఏదైనా సంస్థలో ట్రైనర్ గా అప్పుడప్పుడు వెళుతూవుంటే ఇప్పుడు అదే ఆదుకునేది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. వెంటనే చేయాల్సిన పనులు కొన్ని వున్నాయి. మొదటిది ఇంట్లో ఖర్చులు తగ్గించుకోవడం. కారు మానేసి బండి మీద తిరగటం మొదలుపెట్టవచ్చు. మరీ అవసరమైతే కారు అమ్మేయవచ్చు. మరో ఉద్యోగం దొరికిన తరువాత మరో కారు కొనుక్కోవచ్చు. మీకు ఇబ్బంది కాదనుకుంటే కేబుల్ టీవీ తీసేయండి, సినిమాలు, షాపింగ్ లు మానేయండి. పండగలకి, ప్రయాణాలకీ ఖర్చు పెట్టకండి. మీరు ఉండేది అద్దె ఇల్లు అయితే వూరి చివర కొంచెం చిన్న ఇంటికి మారిపోండి. అద్దెలో వుండే వ్యత్యాసం వల్ల మీకు డబ్బు మిగులుతుంది. మరీ అవసరం అనుకుంటే ఇంట్లో వున్న బంగారం తాకట్టు పెట్టండి. అత్యంత సులువుగా, అనుకోని ఆర్థిక ఇబ్బందులు వున్నప్పుడు బంగారం ఎమర్జెన్సీ ఫండ్ గా ఉపయోగపడుతుంది. అయితే నెలనెలా వడ్డీ కట్టుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోగానే ఆ బంగారం తిరిగి తెచ్చుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చేస్తే మరో మూడు నాలుగు నెలలు గడిచిపోతాయి. ఈ లోగా ధైర్యం కోల్పోకుండా ఉద్యోగప్రయత్నాలు ముమ్మరం చేసి అవసరం అయితే తక్కువ జీతానికైనా ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చూసుకోమని చెప్పండి. పైన చెప్పిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా నియంత్రించండి.

ఈక్వీటీలో డబ్బులు పెడితే రిస్క్ కదా బేతాళా?

ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ఇంకా అడుతునే వుంటారు. రిస్క్ లేనిదే లాభం రాదు అన్నది ప్రపంచంలో ఆ ఆర్థిక నిపుణుణ్ణి అడిగినా చెప్పే మాట. “జయం కోరి సాహసం శాయరా రాజకుమారి లభించేను” అంటాడు కదా నేపాలీ మాంత్రికుడు! అది ఆర్థిక విషయాలకు అక్షరాలా వర్తిస్తుంది. సంపద సాధించాలంటే ఈక్విటీలో డబ్బు పెట్టక తప్పదు. అయితే అది నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, దీర్ఘకాలానికి పెట్టినట్లైతే చాలా వరకు నష్ట భయాన్ని తగ్గించుకోవచ్చు. ఈక్విటీలో డబ్బు పెట్టడం రిస్కే కానీ పెట్టకపోవడం ఇంకా పెద్ద రిస్క్ అని గుర్తుపెట్టుకోవాలి.

వచ్చే నెల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో యెస్.ఐ.పి. చేద్దామని అనుకుంటున్నాను. ఎలాంటి ఫండ్ లో పెడితే మంచిదో చెప్తారా?

తప్పకుండా పెట్టండి. ఈక్విటీలో డబ్బులు పెట్టడానికి అత్యంత సులువైన, చవకైన, రిస్క్ తక్కువ వున్న అవకాశం ఎస్.ఐ.పీ.నే. కాకపోతే ఒకటే అనుమానం. వచ్చే నెల నుంచి ఎందుకు? ఈ నెల నుంచే ఎందుకు చెయ్యటం లేదు? మీరు ఆన్ లైన్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎస్.ఐ.పి ద్వారా కొంటున్నట్లైతే మీరు దరఖాస్తు పెట్టుకున్న మూడు నెలలకు కానీ ఎస్.ఐ.పీ మొదలు కాదు. మీరు వచ్చే నెల అనుకుంటున్నారు అంటే ఇంకో నాలుగు నెలల దాకా అది మొదలుకాదు. మీరు నెలకి రెండు వేలు పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే, మరో ముఫై ఏళ్ళకి మీరు కోల్పోయే లాభం విలువ ఎంతో తెలుసా? కనీసం మూడు లక్షలు పైనే. అందువల్ల వెంటనే మొదలుపెట్టండి. ఇక ఏ స్కూమ్ అంటారా? మొదటిసారి కాబట్టి టాక్స్ ఆదా చేసే మ్యూచువల్ ఫండ్ పథకం ఏదైనా ఎన్నుకోని దానితో ప్రారంభించండి. ఆలస్యం అమృతం విషం.

ఎందుకండీ ఈ ప్లానింగ్? నేను సంపాదించిన మొదటి జీతం మా నాన్న రిటైరెంట్ రోజున జీతం కన్నా ఎక్కువ. ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. నాకు ప్రపంచం అంతా చుట్టి రావాలని కోరిక. కొండలు ఎక్కడం అంటే సరదా. కొత్త కొత్త గాడ్జెట్స్(ఎలక్ట్రానిక్ పరికరాలు) అంటే పిచ్చి. ఇవన్నీ అనుభవించకుండా రూపాయి రూపాయి కూడబెట్టడం అవసరం అంటారా?


అవసరం లేదు. కానీ అవసరమైనప్పుడు డబ్బు లేదు అనుకోకుండా చూసుకోండి. కొన్ని నాలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకోవచ్చు. కొన్ని అనుభవం మీద నేర్చుకోవచ్చు. అనుభవం ఆలస్యమైతే “చేతులు కాలాక...” అన్న సామెతలా అవుతుంది పరిస్థితి. మీ సరదాలు తీర్చుకుంటూనే సంపద కూడా కూడబెట్టచ్చు. ఆ దిశగా ఆలోచించండి. మనసు మారితే సలహా కోసం మళ్ళీ ఇదే కాలమ్ కి రాసి పంపించండి.

డబ్బు కూడబెట్టడం ఎలా? అని బేతాళ కథల ద్వారా భలే నేర్పించారు. తరువాత “పైసల పంచతంత్రం” రాస్తారా?

మీరు సూచించిన పేరు భలే వుంది. బేతాళ కథల్లో చెప్పినా, పంచతంత్రంలో చెప్పినా విషయం అదే కదండీ! అయినా మీరు అడిగారు కాబట్టి ఓ పంచతంత్రం కథ చెప్తాను వినండి. ఓ అడవిలో ఒక జిరాఫి, ఒక చీమ, ఒక జీబ్రా వున్నాయి. జిరాఫి పుట్టిన కొన్ని నిముషాలలోనే లేచి నిలబడి తనంతట తానుగా ఆకులు తినేస్తుంది. చీమ జీవితాంతం ఆహారం సేకరింస్తూనే వుంటుంది. జీబ్రా దొరికినదంతా తినేసి, పొట్టలో వున్న మరో సంచిలో దాచిపెట్టుకోని అవసరం అయినప్పుడు తీసి నెమరువేస్తుంది.డబ్బు విషయంలో మనం కూడా ఈ మూడు జంతువుల్లాగా ప్రవర్తించాలి. జిరాఫీలాగా చిన్నప్పుడే పొదుపు చేయడం మొదలుపెట్టాలి. చీమలాగా సంపాదన వున్నంతకాలం దాచిపెడుతూనే వుండాలి. ఇక జీబ్రాలాగా అవసరం వచ్చినప్పుడే దాచుకున్న డబ్బుని తీసి వాడుకోవాలి. అదీ కథ! ఎలా వుందంటారు?

Sunday, July 5, 2015

రూపీ బేతాళుడి ఆర్థిక సలహాలు 3


గత ఆర్థిక సంవత్సరానికి గాను బోనస్ వచ్చే నెల వస్తోంది. ఆ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందో సలహా చెప్తావా బేతాళా?

తప్పకుండా. బోనస్ లాగా అనుకోకుండా వచ్చే డబ్బుని తెలివిగా దాచుకుంటే మీ ఆర్థిక లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. డబ్బు చేతికి రాగానే అన్నింటి కన్నా ముంది మీకు వున్న అప్పులు మొత్తం తీర్చేయండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ వుంటే వాటిని వదిలించుకోండి. అప్పులు లేకపోతే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఇన్సూరెన్స్ లేకపోతే సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఈ మూడూ అయిపోతే, మీకు ఇల్లు కట్టాలి/కొనాలి అన్న ఆలోచన వుంటే డౌన్ పేమెంట్ కట్టేయండి. కొంత బంగారం కొన్నా మంచిదే. మొత్తం ఒకేసారి స్టాక్ మార్కెట్లో పెట్టడం, అంతా బంగారమే కొనడం చేయకండి. కారు కొనాలని వుంటే ఈ సొమ్ముని డౌన్ పేమెంట్ గా కట్టేయండి. ఇదే వరుసలో బోనస్ ని ఉపయోగించండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బోనస్ వచ్చేలా కష్టపడండి.

నాలుగు సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు వేలు కడుతున్నాను. ఒక్కసారి కూడా క్లెయిమ్ చెయ్యలేదు. ఇన్సూరెన్స్ తీసుకునే బదులు ఏ మ్యూచువల్ ఫండ్ లోనో పెడితే వచ్చే ఆదాయం, అవసరమైనప్పుడు హాస్పిటల్ ఖర్చులకి వాడుకోవచ్చు కదా?

మీ వయసు చెప్పలేదు. పన్నెండొందలు కడుతున్నారంటే మీ కుటుంబం మొత్తానికీ హెల్త్ పాలసీ (మెడీక్లెయిమ్) తీసుకోని వుంటారని ఊహిస్తున్నాను. నాలుగేళ్ళుగా ఒక్కసారి కూడా క్లెయిమ్ చెయ్యలేదంటే, ఒక్కసారి కూడా హాస్పిటల్ లో అడ్మిట్ కాలేదన్నమాట. ఇది సంతోషించాల్సిన విషయమే కదా? ఇన్సూరెన్స్ ప్రీమియమ్ కట్టేటప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి రాకూడదనే కోరుకోవాలి. అవి వచ్చాయంటే మీకు ఏదో నష్టం జరిగిందనే కదా అర్థం. ఇక మీరడిగిన రెండో ప్రశ్న. క్లెయిమ్ లేనంత మాత్రాన మీకు ఏ ఉపయోగం లేదని అనుకోకూడదు. మీరు క్లెయిమ్ చెయ్యకపోవడం వల్ల మీరు ఆరోగ్యవంతమైన కుటుంబం అని ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తిస్తుంది. తదనుగుణంగా ప్రీమియం రేట్లు తగ్గుతాయి. మీరు మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టాచ్చు కానీ, ఈక్విటీ ఆధారిత పెట్టుబడిలో రిస్క్ వుంటుంది. దీర్ఘకాలం డబ్బుని ఉంచితేనే లాభం వస్తుంది. ఈలోగా అనారోగ్యం వస్తే? లేదూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే? ఈక్విటీ పెట్టుబడి వేరు, అత్యవసరానికి పనికొచ్చే ఇన్సూరెన్స్ వేరు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు వార్థక్యం వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఎవరూ ఇవ్వరు. ఇచ్చినా దాని ప్రీమియం చాలా ఎక్కువగా వుంటుంది. అదీకాక హెల్త్ ఇన్సూరెన్స్ కి కట్టిన ప్రీమియం సెక్షన్ 80D కింద ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుంది. అందువల్ల యుక్త వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోని జీవితాంతం కొనసాగించడం మంచిది.

చాలా రోజుల నుంచి కుటుంబం మొత్తం కలిసి సరదాగా విదేశీయాత్ర చేయాలని అనుకుంటున్నాము. అందుకు తగ్గట్టుగా నెల నెలా కొంత డబ్బు పక్కనపెట్టాలని ఆలోచన. ఎక్కడ పొదుపు చేస్తే మంచిదో చెప్తారా?

మీ ఆదాయాన్ని బట్టి విదేశీయాత్ర షార్ట్ టర్మ్ గోల్ లేదా మీడియం టర్మ్ గోల్ కిందకు వస్తుంది. అంటే సుమారుగా సంవత్సరం లేదా మూడు సంవత్సరాలలో నెరవేర్చుకోవాల్సిన కోరిక. అందువల్ల డబ్బుని లిక్విడిటీ వున్న మార్కెట్ ఆధారితం కాని పథకాలలో పెట్టడం మంచిది. అంటే రికరింగ్ డిపాజిట్, తక్కువ కాలానికి మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ ఇలాంటివన్నమాట. కానీ అసలు సమస్య అది కాదు. మీరు ఫారిన్ టూర్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? కుటుంబంతో కలిసి సరదాగా గడపాలనే కదా? అందుకు విదేశాలకే వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? చాలాసార్లు మీరు పెట్టే ఖర్చు వల్ల ఆనందం రాదు. మీరు పెట్టిన ఖర్చు వల్ల కుటుంబం సంతోషంగా వున్నప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కొత్త ప్రదేశాన్ని చూశామన్న ఆనందం మీ భార్యా పిల్లలకు కలిగినప్పుడే మీకు ఆనందం కలుగుతుంది. అదే నిజమైతే విదేశాలకే వెళ్ళాలని నియమం ఏమీ లేదు కదా? మన దేశంలోనే ఎన్నో ఆహ్లాదకరమైన ప్రదేశాలు వున్నాయి. విహారానికి మీరు స్విజర్లాండ్ వెళ్ళినా సిమ్లా వెళ్ళినా ఆనందంలో పెద్ద తేడా రాదు. తక్కువ చార్జీల కారణంగా మిగిలిన డబ్బుని అక్కడ ఖర్చు చేయటం వల్ల ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవించవచ్చేమో గమనించండి.

మనిషి తయారు చేసిన డబ్బు మనిషినే ఆడిస్తోంది. డబ్బుకి ఇంత విలువ ఇవ్వటం అవసరం అంటారా?

అవసరం లేదు. కానీ మీ చుట్టుపక్కల వున్న వాళ్ళు మీకు విలువ ఇవ్వటం మానేస్తే మీకు ఫర్లేదా? మరొకరు కోట్లకు కోట్లు సంపాదిస్తుంటే మీరు అసూయ చందకుండా వుండగలరా? డబ్బు లేని కారణంగా కోరికలు తీరటంలేదని బాధపడకుండా వుండగలరా? అనారోగ్యమో, ప్రమాదమో, అత్యవసరమో వచ్చినప్పుడు చేతిలో డబ్బు లేకుండా దాన్ని దాటేయగలరా? ఇలాంటి వాటికి అతీతంగా మీరు ఉండగలిగితే డబ్బుని తుఛ్ఛమైనదిగా భావించి తిరస్కరించవచ్చు. అక్కడికి చేరటం కూడా ఒక యోగమే.

మీ కథలన్నింటినీ కలిపి మూడు ముక్కల్లో చెప్పాలంటే....

సంపాదించే ప్రతి రూపాయికి ఒక పరమార్థం వుండాలి. ప్రతి ఖర్చుకి ఒక లెక్క వుండాలి. ప్రతి పెట్టుబడికి ఒక లక్ష్యం వుండాలి.